ప్రమాదవశాత్తు గాయాలపాలైన ఓ తల్లి తన అవయవాలతో ముగ్గురికి ప్రాణం పోసింది. విశాఖకు చెందిన సన్యాసమ్మ అవయవాలు దానం చేయగా కిడ్నీలను చెన్నైకి పంపి కళ్లను విశాఖలోనే మరొకరి దానం చేశారు. ఆమె ‘గుండె’ ఓ చిన్నారికి ఊపిరి అందించింది: బ్రెయిన్‌డెడ్‌ అయిన ఓ మహిళ అవయవాలు ముగ్గురికి ప్రాణం పోశాయి. ఆమె గుండె, ఓ చిన్నారికి ఊపిరి ఊదింది. విశాఖకు చెందిన భెల్‌ ఉద్యోగి ఆనందరావు భార్య సన్యాసమ్మ ఈనెల 16న కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో సన్యాసమ్మ తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. మూడు రోజులైనా కోలుకోలేదు. దీంతో వైద్యులు బ్రెయిన్‌డెడ్‌‌గా నిర్ధారించారు. ఆ తర్వాత వైద్యులు, జీవన్‌దాన్‌ సిబ్బంది కలిసి సన్యాసమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడగా వారు అవయవదానానికి అంగీకరించారు.

శుక్రవారం సన్యాసమ్మ శరీరం నుంచి గుండె, కిడ్నీలు, కళ్లు వేరు చేశారు. గుండెను తిరుపతిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారికి అమర్చాలని జీవన్‌ధాన్‌ అధికారులు నిర్ణయించారు. వెంటనే విశాఖ పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ సహాయంతో గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ప్రత్యేక అంబులెన్స్‌లో విమానాశ్రయానికి తరలించారు. వైద్యుల సమక్షంలో ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి పంపించారు. సన్యాసమ్మ కిడ్నీలను చెన్నైకి పంపించారు. కళ్లను విశాఖలోనే మరొకరి కోసం తరలించారు. దీంతో ముగ్గురి సమస్యలు తీరాయి. అవయవ దానానికి ముందుకొచ్చిన సన్యాసమ్మ భర్త ఆనందరావు, కుమారులు చైతన్య, జయప్రకాశ్‌లను వైద్యులు, జీవన్‌దాన్‌ సిబ్బంది అభినందించారు.