Advertisement

 ఆస్తి కోసం సొంత అక్కనే ఓ తమ్ముడు కిరాతకంగా హత్య చేసిన ఘటన ప్రశాంత్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే , మలక్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని ఈస్ట్‌ ప్రశాంత్ నగర్‌లో నివసించే సిద్దార్థ్‌ వృత్తి రీత్యా వనపర్తి డివిజన్‌లో నీటిపారుదలశాఖలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తన సోదరి శివనందినితో కొంతకాలంగా అతడికి ఆస్తి తగాదాలు ఉన్నాయి. శివనందిని కుటుంబ తగాదాల నేపథ్యంలో భర్తతో విడాకులు తీసుకుని సోదరుడు సిద్ధార్థ్‌ వద్దనే ఉంటోంది. ఆమె ఆస్తిపై కన్నేసిన సిద్ధార్థ.. పథకం ప్రకారం మూడు రోజుల క్రితమే ఆమెను హత్య చేసి మృతదేహాన్ని బాత్‌రూంలో దాచిపెట్టాడు. అనంతరం తన సోదరి కన్పించడం లేదంటూ కుటుంబ సభ్యులతో వచ్చి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇంట్లోంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన పోలీసులు సిద్ధార్థ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడిందని మలక్‌పేట సీఐ సుబ్బారావు తెలిపారు. తమదైన శైలిలో విచారించగా ఆస్తి కోసమే తన సోదరిని చంపినట్టు నిందితుడు అంగీకరించాడని, అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.