వీధిలోనే తలదాచుకుంటున్న వృద్ధ దంపతులు

నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులు- ఆ తనయులకు భారమయ్యారు. తిండి పెట్టబోమంటూ వృద్ధులైన తల్లిదండ్రులను ముగ్గురు తనయులు వెళ్లగొట్టిన సంఘటన…

జనగామ, లింగాలఘనపురం మండలం నెల్లుట్లలో గ్రామానికి చెందిన రావుల యాదగిరి, యాదమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. యాదమ్మ అనారోగ్యంతో మరణించడంతో అంజమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. అంజమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె జన్మించారు. ఎకరం పొలం అమ్మి మొదటి భార్య ఇద్దరు కుమార్తెలు, అంజమ్మ కుమార్తె వివాహం చేశారు. యాదగిరి మొదటి భార్య కొడుకు పరమేశ్‌, రెండో భార్య కుమారులు వెంకటేశ్‌, యాకయ్యల మధ్య ఇల్లు, పొలం పంపకం విషయంలో గొడవలు నెలకొన్నాయి. వారు లారీ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. కొడుకులు, కోడళ్ల దూషణలు భరించలేని యాదగిరి దంపతులు ఐదేళ్లుగా వేరే అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారి పేరిట ఉన్న ఎకరంన్నర పొలంపై వచ్చే ఆదాయం, ఆసరా పింఛన్‌తో జీవనం సాగిస్తున్నారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా వారు ఉంటున్న అద్దె ఇంటిని కూల్చేశారు.

మరో ఇంటికి అద్దె చెల్లించలేని పరిస్థితిలో వారు కొడుకులను ఆశ్రయించారు. వారు వెళ్లగొట్టడంతో వృద్ధ దంపతులు నెల రోజులుగా తమ సొంత ఇంటి ఆవరణలోనే ఉంటున్నారు. బయట ఉన్న అరుగులపైనే వంటగిన్నెలు, దుస్తులను భద్రపర్చుకున్నారు. ఆరుబయట మంచం వేసుకొని చలికి వణుకుతూ నిద్రిస్తున్నారు. వారికి మంగళవారం వరకు తిండి పెట్టిన చిన్నకుమారుడు.. ఇక తిండి పెట్టలేనని చెప్పడంతో వృద్ధ దంపతులు బోరున విలపించారు. కొన్ని రోజుల పాటు తల్లిదండ్రులను ఉంచుకోవాలంటూ గ్రామ పెద్దలు యాదగిరి దంపతులను పెద్ద కుమారుడు పరమేశ్‌కు అప్పగించారు.