చిన్న వయసులోనే వళ్లంతా తడిమే నీచులు

ఎనిమిదేళ్ల వయసులోనే వేధింపులకు గురయ్యానని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తెలిపారు. తనుశ్రీ వివాదం మొదలైన తర్వాత ఆమెకు మద్దతుగా ఇప్పటికే పలువురు నటీమణులు, ఆర్టిస్టులు సినిమా సెట్‌లో ఎదురైన వేధింపులను బయటపెట్టారు. ఈ నేపథ్యంలో చిన్మయి కూడా ‘మీ టూ’ ఉద్యమంలో చేరారు. ట్విటర్‌ వేదికగా తనకు చిన్నతనం నుంచి ఎదురైన పలు చేదు అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి సంఘటల్ని జ్ఞాపకం తెచ్చుకోవడం చాలా కష్టంగా, బాధగా ఉంటుందని అన్నారు.

‘అప్పుడు నాకు 8 ఏళ్లు ఉంటాయి. మా అమ్మ తన డాక్యుమెంటరీ కోసం రికార్డింగ్‌ సెషన్‌ పనిలో ఉన్నారు, నేను నిద్రపోతున్నా. నన్ను ఎవరో పట్టుకుని తడుముతున్న భావన కలిగి నిద్రలేచా. ‘ఈ అంకుల్‌ చెడ్డవాడు’ అని మా అమ్మకు చెప్పా. ఇదంతా సాంతోమ్‌ కమ్యూనికేషన్స్‌ స్టూడియోలో జరిగింది. అది ఇప్పటికీ ఉంది’ అని చిన్మయి పేర్కొన్నారు.

అనంతరం పదేళ్ల వయసులో జరిగిన మరో సంఘటన గురించి చెప్పారు. మ్యూజిక్‌ ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు అక్కడ వరసకు మామ అయ్యే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని చిన్మయి అన్నారు. చాలా మంది చిన్నారులు పెద్దల మధ్య సురక్షితంగా లేరని అభిప్రాయపడ్డారు. తన 19 ఏళ్ల వయసులో ఓ వృద్ధుడు ప్రేమగా కౌగిలించుకున్నట్లు నటించి, తప్పుగా ప్రవర్తించాడని.

ఆయనకు చెప్పు చూపించి ‘బై‌ సర్‌’ అని చెప్పి కోపంగా వచ్చేశానని తెలిపారు. ఓ మహిళ తనకు జరిగిన వేధింపుల గురించి పేర్లతో సహా చెబితే ఆపై అవకాశాలు రావని అన్నారు.