తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడి పెళ్లి చూడాలని ఎంతో సంబరపడ్డాడు. ఓ యువతితో అతడి పెళ్లి కూడా నిశ్చయించారు. కానీ మరి కొన్ని రోజుల్లో పెళ్లి ఉంది అనగా అతడు అనారోగ్య కారణాలతో మరణించాడు. దీంతో కుమారుడు ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఇప్పుడు అందరి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది. వివరాలు: కల్లకురిచ్చి జిల్లా పెరువంగూరుకు చెందిన వి. రాజేంద్రన్ (65) సామాజిక కార్యకర్త డీఎంకే క్రియాశీల సభ్యుడిగా కూడా ఉన్నారు. అయితే అతడు గత కొన్నేళ్లుగా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అతడికి 29ఏళ్ల ఆర్. ప్రవీణ్ అనే కుమారుడు ఉన్నాడు. తాను బతికి ఉన్నప్పుడే కుమారుడి వివాహం చూడాలని అనుకున్నాడు. దీంతో చెన్నైలో మేడవాక్కంకు చెందిన 23ఏళ్ల సౌర్నమాల్యతో పెళ్లి నిశ్చయించారు. ఆమె ప్రవీణ్ పని చేసే ఆఫీసులోనే పని చేస్తూ ఉంటుంది.
వారిద్దరూ ప్రేమికులు కూడా వీరి ప్రేమకు పెద్దలు కూడా ఒప్పుకోవడంతో మార్చ్ 27వ తేదీన కల్లకురిచ్చిలో వివాహం జరిపించాలని నిర్ణయించారు. అయితే వి. రాజేంద్రన్ నెల రోజుల కిందట బాత్ రూమ్ లో జారిపడ్డాడు. అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆదివారం రాత్రి ఆయనను హస్పటల్ లో చేర్పించగా అదే రోజు పరిస్థితి విషమించి మరణించాడు. అయితే ప్రవీణ్ తన తండ్రి కోరికను నెరవేర్చాలని అనుకున్నాడు. అంతిమ సంస్కారాలకు ముందు తండ్రి మృతదేహం దగ్గర ప్రియురాలి మెడలో తాళి కట్టాడు తరువాత తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా కొందరు గ్రామస్తులు, బంధువుల వ్యాఖ్యలను తాను పట్టించుకోనని ఒక కొడుకుగా ఇది తన కర్తవ్యమని ప్రవీణ్ అన్నారు.