తండ్రి చనిపోయిన తర్వాత తల్లి ఒంటరి తనాన్ని చూసి భరించలేకపోయిన ఓ కొడుకు ఆమెకు మళ్లీ కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. సమాజం కట్టుబాటు సంకెళ్లను తెంపి తల్లికి రెండో పెళ్లి చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపుర్లో చోటుచేసుకుంది. యువరాజ్ షేలే (23) 5ఏళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయాడు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ షేలేను చూసుకుంటున్నాడు. తండ్రి చనిపోయినప్పటి నుంచి తల్లి ఇంట్లోనే ఒంటరితనాన్ని అనుభవిస్తూ కాలం గడుపుతోంది. ఇరుగు పొరుగువారితోనూ ఎలాంటి సంబంధాలు లేకపోవడం చూసి ఆ యువకుడి మనసును కలిచి వేసింది. ఎలాగైనా ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేయాలని భావించాడు. దీంతో మళ్లీ తన తల్లికి పెళ్లి చేయాలని యువరాజ్ నిశ్చయించుకున్నాడు. స్నేహితులు, బంధువుల సహాయంతో వరుడి కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ ప్రయత్నంలోనే మారుతి అనే వ్యక్తి తన తల్లికి సరైనవాడని భావించాడు. తల్లికి ఈ విషయం చెప్పి ఒప్పించాడు. అనంతరం వారిద్దరికి వివాహం జరిపించాడు. యువరాజ్ షేలే మాట్లాడుతూ:
‘‘నాకు పదేళ్లు ఉన్నప్పుడు నాన్న రోడ్డు ప్రమాదంలో చనిపోవడం షాక్కు గురిచేసింది కానీ, నాన్న మరణం అమ్మ జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది ఆమెను ఒంటరితనం ఆవహించి సమాజంలోకి రావడం మానేసింది తండ్రి మరణం తరువాత సామాజిక కట్టుబాట్లు మానసికంగా మరింత ప్రభావితం చేశాయి అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలను నేను చూసుకుంటూ తల్లి కోసం జీవిత భాగస్వామి అవసరాన్ని గ్రహించాను’’ అని వివరించాడు.
‘‘మా అమ్మ నాన్నకు దాదాపు 25 ఏళ్ల క్రితం వివాహమైంది ఒక వ్యక్తి తన భార్యను కోల్పోతే అతను తిరిగి వివాహం చేసుకోవడం సహజమని సమాజం భావిస్తుంది. ఇదే విషయం ఒక మహిళకు ఎందుకు వర్తించదని నేను ఆశ్చర్యపోయాను ఆమెను మళ్లీ పెళ్లికి ఒప్పించాలని నిర్ణయించుకున్నాను. సాంప్రదాయ విలువలతో కూడిన కొల్హాపూర్ లాంటి నగరంలో తన దగ్గరి బంధువులు, ఇరుగుపొరుగు వారిని ఒప్పించడం అంత సులువు కాదు’’ అరి షేలే తెలిపాడు. అయితే, కొందరు స్నేహితులు, బంధువులు తనకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నాడు. ఈ క్రమంలో మారుతి ఘనావత్ గురించి తెలిసిందని, అతడి గురించి అమ్మకు వివరించి ఒప్పించామని తెలిపాడు. ఘనావత్ మాట్లాడుతూ: కొన్నేళ్ల నుంచి నేను ఒంటరిగా ఉన్నానని, రత్నాను కలిసి మాట్లాడిన తర్వాత ఆ కుటుంబంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. రెండో పెళ్లి చాలా కఠిన నిర్ణయమని, ఇందుకు ఆమె ముందు ఒప్పుకోలేదని చెప్పారు.