తాగుబోతు భర్తతో వేగలేక

మద్యానికి బానిసైన భర్త ప్రవర్తనతో విసిగిపోయిన వివాహిత క్షణికావేశంలో ముగ్గురు పిల్లలు సహా నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఇద్దరు చిన్నారులు మృతిచెందగా. బాలుడు గల్లంతయ్యాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ జిల్లా అనుముల మండలంలో శుక్రవారం ఘటన జరిగిన ఘటన స్థానికంగా విషాదం అలముకుంది.

Advertisement

నల్గొండ జిల్లా పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మోహన్, స్వాతికి 8ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి సాత్విక(6), మధునశ్రీ(4), మమంత్‌ కుమార్‌(3) పిల్లలు. మోహన్‌ మద్యానికి బానిసవడంతో, దంపతుల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన స్వాతి పిల్లలతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. సాగర్ కాల్వగట్టున కనపడిన స్వాతి, పిల్లలను చూసి ఆటో డ్రైవర్‌ వెంకటేశ్వర్లు వాళ్లను గమనించి అటువైపు వచ్చే ప్రయత్నం చేశాడు. ఈ లోపే అప్రమత్తమైన ఆమె తొలుత కుమారుణ్ని కాల్వలో తోసేసి. తర్వాత ఆడ పిల్లల్ని పట్టుకుని తానూ దూకింది.

ఆటో డ్రైవర్‌ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్వాతి, సాత్విక, మధునశ్రీలను కాపాడి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పిల్లలిద్దరూ మృతి చెందగా స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. ‘వాళ్లను రక్షించే క్రమంలో ఒడ్డున ఉన్న చున్నీని నీళ్లలో వేశానని, పట్టుకోమని బతిమిలాడినా స్వాతి పట్టుకోలేదని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చానని’ ఆటో డ్రైవర్‌ తెలపాడు.