గణపురం మండలంలోని గణపేశ్వరాలయంలో జర్మనీ దేశస్తులు గత శనివారం సందడి చేశారు. జర్మనీ దేశానికి చెందిన శ్రీసాయి ట్రస్టు ప్రాణికల్ యోగా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన జర్మనీ దేశస్తులు ఆలయ ప్రాంగణంలో యోగ శిక్షణ తరుగతుల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రాణికల్ యోగ సాధన చేశారు.

గణపేశ్వరాలయంలో నగిశీలు, శిల్ప సంపదకు ముగ్దులయ్యారు. కెమెరాల్లో ఫొటోలు తీసుకున్నారు. గుడికి దగ్గరే ఉన్న తాటివనానికి వెళ్లిన జెర్మన్లు కల్లుతాగారు. తాటికల్లు టేస్ట్ కు ఫిదా అయ్యారు. కల్లు ఎంతో అద్భుతంగా వుందని చెప్పారు. కల్లుగీత కార్మికులు చెట్టుపైకి ఎక్కి కిందకు దిగడం చూసి షాకయ్యారు. ఇది యూనిక్ టాలెంట్ అని గౌడ్ అన్నలను మెచ్చుకున్నారు.

వెంకటాపురం మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన తాము జర్మనీలో స్థిరపడి అక్కడ శ్రీసాయి ట్రస్టు ప్రాణికిల్ యోగా సంస్థను స్థాపించామని. యోగ శిక్షణను ఇస్తున్నామని ట్రస్ట్ చైర్మెన్ సాయిరెడ్డి చెప్పారు. జర్మనీ నుంచి యోగా స్టూడెంట్స్ ను ప్రతి ఏడూ తీసుకొస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా పర్యటిస్తామని చెప్పారు. జర్మనీ నుంచి వచ్చిన వాళ్లు ఆ దేశంలో ప్రొఫెసర్లు, ఇంజినీర్లు, డాక్టర్లుగా పనిచేస్తున్నారని చెప్పారు.