ఉగ్రవాదులకు ఊతమివ్వొద్దని, మనుషుల ప్రాణాలు తీయొద్దని భారత్ ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతూ వస్తున్న పాకిస్తాన్‌ గుండెల్లో భారత విమానాలు సింహగర్జన చేస్తున్నాయి. భారత్ డబుల్ మాస్టర్ స్ట్రోక్స్‌తో ఉగ్రస్తాన్‌కు చెమటలు పోయించింది. ఈ రోజు రాజస్తాన్ సరిహద్దులో భారత యుద్ధవిమానాలు భీకరంగా చక్కర్లు కొట్టాయి. గట్టిగా ఎదురుదెబ్బ కొట్టేముందు శత్రువుకు హెచ్చరిక అన్నట్లుగా భారత వాయిసేన, ఈ రోజు పాక్ తో సరిహద్దు ఉన్న రాజస్తాన్‌లో ఫైటర్ జెట్స్, అటాక్ హెలికాప్టర్లు సహా అన్ని రకాల యుద్ధ విమానాలతో విన్యాసాలు చేయించింది

పాక్ సరిహద్దులో భారత యుద్ధ విమానాలు విన్యాసాలు

భారత వాయుసేన శనివారం భారత్-పాక్ సరిహద్దులో భారీ విన్యాసాలు చేపట్టింది. ఇందులో ఫైటర్ జెట్స్, అటాక్ హెలికాప్టర్లు సహా అన్ని రకాల యుద్ధ విమానాలు పాలుపంచుకుని వాయుసేన శక్తిని చాటాయి. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జరిపిన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.

ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత భారత వాయుసేన విన్యాసాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం మాట్లాడుతూ ఉగ్రదాడికి బదులు తీర్చుకునే విషయంలో భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు పేర్కొన్నారు.

వాయుశక్తి విన్యాసాల్లో భాగంగా భారత వాయుసేన తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించింది. దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం(ఎల్‌సీఏ) తేజాస్, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్), భూమిపై నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగలిగే ఆకాశ్ క్షిపణి, గాల్లోంచి గాల్లోని లక్ష్యాలను తుత్తునియలు చేసే ఆస్త్ర వంటివాటితో విన్యాసాలు నిర్వహించారు. ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు రాత్రీ, పగలు తేడా లేకుండా లక్ష్యాలను ఛేదించాయి. మిలటరీ విన్యాసాల్లో ఏఎల్‌హెచ్, ఆకాశ్‌లను మోహరించడం ఇదే తొలిసారి.

వీటితోపాటు అప్‌గ్రేడ్ చేసిన మిగ్-29 యుద్ధ విమానాలు కూడా ఈ విన్యాసాల్లో పాలు పంచుకున్నాయి. ఎస్-30, మిరాజ్ 2000, జాగ్వార్, మిగ్-21, బైసన్, మిగ్-27, మిగ్-29, ఐఎల్ 78, హెర్క్యులస్, ఏఎన్-32 తదితర మొత్తం 137 యుద్ధ విమానాలు విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, భారత వాయుసేన గౌరవ గ్రూప్ కెప్టెన్ అయిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తదితరులు విన్యాసాలను తిలకించారు.