మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు గన్‌మెన్లను తొలగిస్తూ హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంపై ప్రదీప్ రావు స్పందించారు. బీజేపీలో చేరినందుకే తనకు గన్‌మెన్లను తొలగించారని ఆరోపించారు. ఓ ఎమ్మెల్యే తన అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నారని, ఇలాంటి సమయంలో గన్‌మెన్‌లను తొలగించడం కక్ష సాధింపు చర్యే అని ప్రదీప్ రావు విమర్శించారు. తనకు ప్రాణహాని ఉందని గతంలోనే గన్‌మెన్‌లను కేటాయించారని ఎర్రబెల్లి దయాక్ రావు గుర్తు చేశారు. తనకు ఏం జరిగినా ప్రభుత్వం, ఎమ్మెల్యేదే బాధ్యత అని తెలిపారు. వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌గా ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఉన్నారు. గతంలో టీఆర్ఎస్‌లో కొనసాగిన ఆయన ఆ తర్వాత బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబంలో విబేధాలు ఉన్నాయని. అందుకే ఆయన తమ్ముడు పార్టీ మారారనే ఆరోపణలు వినిపించాయి. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించే అవకాశం లేదని, అందుకే ప్రదీప్ రావు బీజేపీలో చేరారనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

గతంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు ప్రభుత్వం 2 ప్లస్ 2 గన్‌మెన్లను కేటాయించింది. గత ఏడేళ్లుగా ఆయనకు సెక్యూరిటీ కొనసాగుతోంది. ఇప్పుడు సడెన్‌గా తొలగించడంపై ప్రదీప్ రావు మండిపడుతున్నారు. గన్‌మెన్లను తొలగించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వం భద్రత కుదించడం వివాదానికి దారి తీసింది. పొంగులేటి గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్‌పై తీవ్ర అసంతృప్తి వెల్లగక్కుతూ వస్తోన్నారు. పొంగులేటి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. దాదాపు ఆయన బీజేపీలో చేరడం కన్ఫార్మ్ అయిన తరుణంలో ప్రభుత్వం భద్రతను తగ్గించడం వివాదాస్పదంగా మారింది. పొంగులేటి తరహాలో ఇప్పుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు ప్రభుత్వం భద్రత తొలగించడం చర్చనీయాంశంగా మారింది.