పోలీసులను కించపర్చేలా మాట్లాడితే సహించేది లేదు

పోలీసులను కించపర్చేలా మాట్లాడితే సహించేది లేదని ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు పంజాల ఆశోక్ కుమార్ హెచ్చరించారు. పోలీసులను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రాజకీయ నాయకులు, పోలీసులను కించపర్చేలా మాట్లాడుతున్నారన్నారు. తమ ఇష్టారీతిలో రాజకీయ నేతలు పోలీసులను దూషిస్తున్నారని ఆయన ఆరోపించారు. సంగెం ఎన్నికల ప్రచారంలో పరకాల నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ పోలీసులపై అనుచిత వాఖ్యలు చేస్తూ విరుచుకుపడడం, దుర్భాషలాడడం పోలీసు జాతిని కించపరిచే విధంగా ఉందన్నారు.

https://youtu.be/ilHk5DyI4pI

శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ కుటుంబాలను విడిచి ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులపై విమర్శలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. పోలీసు సిబ్బంది మనోభావాలను దెబ్బతీసే విధంగా కొండా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కొండా సురేఖ తన మాటలను వెనక్కి తీసుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అందరికీ అలుసైందన్నారు.

అధికారులు ఒక్కసారి అనుమతిస్తే అక్రమార్కులను ఏరిపారేస్తామని ఆయన హెచ్చరించారు.