భార్య వివాహేతర సంబంధం ముగ్గురు ప్రాణాలను తీసింది. గుట్టుగా కాపురం చేయాల్సిన ఆ భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ అవమానం భరించలేని భర్త ఇద్దరు పసిబిడ్డలికి ఉరి వేసి ఆ ఫోటోని వాట్సాప్ ద్వారా భార్యకు పంపాడు. ఆ వెంటనే తానూ ఇంటి పైకప్పునకు ఉరేసుకున్నాడు. భర్త పంపిన మెసేజ్ చూసుకున్న భార్య వెంటనే బల్లార్పూర్ స్టేషన్కు సమాచారం అందించింది. అలాగే సమీప దూరంలో నివసిస్తున్న తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు వెంటనే రుషికాంత్ ఇంటిపైన నివాసం ఉండే సోదరుడికి ఫోన్లో చెప్పారు. అతను పోలీసుల సహాయంతో తలుపు బద్దలు కొట్టి చూడగా ముగ్గురూ విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ దారుణ సంఘటన బల్లార్పూర్లో చోటుచేసుకుంది. కన్నంవార్ వార్డులోని రుషికాంత్ అనే వ్యక్తి భార్య, ఇద్దరు చిన్నారులతో కలిసి జీవిస్తున్నాడు. ఆ ప్రాంతంలోనే ప్రైవేటు ఐటీఐ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. సాఫీగా సాగుతున్న వారి సంసారంలో భార్య వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. ఆమె మరోవ్యక్తితో కలిసి వెళ్లిపోవడంతో రుషికాంత్ మానసిక క్షోభకు గురయ్యాడు. ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోయింది. అయిదేళ్ల నారాయణి, రెండేళ్ల కార్తిని పెంచేదెలా అనే ఆలోచనతో రుషికాంత్ ఇంతటి ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు…