రైలు పట్టాలు దాటుతు-

ఫతేనగర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ 2 నుంచి ప్లాట్‌ఫామ్‌ ఒకటి మీదికి వచ్చేందుకు రైలు పట్టాలు దాటుతున్నాడు. కాగా అదే ప్రాంతంలో పట్టాల మూల మలుపు ఉండడంతో వేగంగా దూసుకొచ్చిన రైలు ఆ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో మృతుడిని గుర్తించేందుకు వీలు లేకుండా ఉంది.

మృతుడు సుమారు 40 సంవత్సరాలు ఉంటాడని, డార్క్‌ బ్లూ కలర్‌ జీన్స్‌, స్కై బ్లూ కలర్‌ టీషర్ట్‌ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి చేతిపై ఎస్‌, హెచ్‌ అనే పచ్చబొట్టు ఉంది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసిన వారు నాంపల్లి రైల్వేస్టేషన్‌లో గానీ, 7901121127లో గానీ సంప్రదించాలని కోరారు.