రైలు పట్టాలు దాటినా ,సెల్ఫీ తీసినా 6 నెలలు జైలు

రైలు పట్టాలు దాటినా, ట్రాక్‌పైకి వచ్చినా కఠిన చర్యలు తప్పవని దక్షిణమధ్యరైల్వే ఓ ప్రకటనలో హెచ్చరించింది. రైల్వేచట్టం 1989 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించేవారిపై సెక్షన్‌ 147 ప్రకారం ఆరునెలల వరకు జైలు శిక్ష.. రూ.1000 జరిమానా. లేదంటే రెండూ ఉంటాయని స్పష్టంచేసింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సమీపంలో ఇటీవల జరిగిన ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ అప్రమత్తమైంది. భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు పేర్కొంది. సురక్షిత ప్రయాణం కోసం ఇటు ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలు రైల్వే నిబంధనల్ని పాటించాలని కోరింది.
రైల్వేస్టేషన్లలో, మార్గమధ్యలో గానీ పట్టాలపైనుంచి వెళ్లొద్దు. స్టేషన్లలో అయితే పాదచారుల వంతెనల ద్వారా ట్రాక్‌కు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లాలి. ఇతరచోట్ల సబ్‌వేలు, రోడ్‌అండర్‌బ్రిడ్జిలు, రైల్వేక్రాసింగ్‌ల ద్వారా దాటాలి.
రైల్వేట్రాక్‌ సమీపంలోను, రైలు ఎక్కేటప్పుడు గానీ ఫోన్‌ వాడొద్దు.

ట్రాక్‌ సమీపంలో ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టవద్దు. ట్రాక్‌పై, సమీపంలో సెల్ఫీలు దిగొద్దు.