లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాను: తాటికొండ రాజయ్య
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తన విజయానికి సోపానమని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తాటికొండ రాజయ్య ధీమా వ్యక్తం చేశారు. మండలకేంద్రంలో శుక్రవారం పోలింగ్ బూత్లో కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం రాజయ్య విలేకరులతో మాట్లాడారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో గత 24యేళ్లుగా ప్రజా జీవితంలో ఉంటూ ప్రజలకు సేవ చేసినట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్పై పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు తనకు ఓటు వేస్తారనే విశ్వాసం ఉందన్నారు. లక్ష ఓట్లే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు, గతంలో ఎన్నికల్లో వచ్చిన 58వేల ఓట్ల మెజార్టీని మించి పోతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
స్టేషన్ఘన్పూర్టౌన్లోని 116వ బూత్లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన రాజయ్య ఉదయం 9.20నిమిషాలకు ఓటు హక్కు వినియోగించుకున్నారు.