దుప్పట్లు, బట్టల అమ్మకాల ముసుగులో చోరీలకు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన నలుగురు ముఠా సభ్యులను శనివారం సి.సి.ఎస్‌ పోలీసులు అరెస్టు చేసారు. పోలీస్‌ అరెస్టు చేసిన ముఠా సభ్యుల నుండి సుమారు 27లక్షల రూపాయల విలువగల 900గ్రాముల బంగారు అభరణాలతో పాటు, 5వేల రూపాల నగదు, 6సెల్‌ఫోన్లు మరియు చోరీలకు వినియోగించే సాధనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నలుగురు నిందితులు టాంగ్రా జిల్లా, కలకత్తా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన 1. రఫీకుల్‌ షేక్‌ తండ్రి పేరు షేక్‌ మాలిక్‌, వయస్సు 30, 2.రోకస్‌ షేక్‌, తండ్రి పేరు నూరుద్దీన్‌, వయస్సు 37సంవత్సరాలు, 3. ఓహిదుల్‌ మొల్లా, తండ్రి పేరు శరత్‌ అలీమొల్లా, 33సంవత్సరాలు, 4.జుంతోటి మొల్లా, తండ్రి బిల్‌లాల్‌ మొల్లా, వయస్సు 26 సంవత్సరాలు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. వి.రవీందర్‌ వివరాలను వెల్లడిస్తూ, బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన ఈ నలుగురు నిందితులు దుప్పట్లు, బట్టలు అమ్ముకునేవారు. ఇదే సమయంలో నిందితులు తమ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బును ఇష్టాను సారం ఖర్చు చేయడంతో పాటు, మద్యం మరియు ఇతర జల్సాలకు అలవాటు పడటంతో నిందితులకు తమ వ్యసనాలకు అవసరమయిన డబ్బు సరిపోకపోవడంతో సులభమైన మార్గంలో డబ్బు సంపాదించాలనే ఆలోచన నిందితులు చోరీలు చేసేందుకు ప్రణాళికను రూపోందించుకున్నారు. ఇందులో భాగంగా నిందితులు దుప్పటలు, బట్టలు వివిధ ప్రాంతాల్లో అమ్మే క్రమమంలో తాళం వేసివున్న ఇండ్ల గుర్తించి, అదును చూసుకోని తాళం వేసివున్న ఇండ్ల తాళాలు పగులగోట్టి చోరీలకు పాల్పడేందుకు సిద్దపడ్డారు. ఇందుకోసం నిందితులు చోరీలు చేసేందుకుగాను గత 2018 సంవత్సరం నవంబర్‌ మాసంలో వరంగల్‌ నగరానికి చేరుకున్న నిందితులు వరంగల్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని శివనగర్‌ ప్రాంతంలో నివాసం వుండేందుకుగాను ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. నిందితులందురు ఇదే ఇంటిలో నివాసం వుంటూ, ట్రై సిటీతో పాటు ఖమ్మం జిల్లాలోను దుప్పట్లు, బట్టల వ్యాపారంతో పాటు, తాళం వేసివున్న ఇండ్లను గుర్తించి అదును చూసుకోని చోరీలకు పాల్పడే వారు.

నిందితులు చోరీ చేసిన బంగారు, వెండి అభరణాలను తాము నివాసం వుంటున్న ఇంటిలోనే భద్రపరిచేవారు. ఇలా భద్రపర్చిన చోరీ సోత్తులో కోంత బంగారాన్ని వరంగల్‌ నగరంలో బులియన్‌ మార్కెట్‌లో అమ్మేందుకు నిందితులు వస్తున్నట్లుగా పక్కా సమాచారం అందుకున్న సి.సి.ఎస్‌ ఇన్స్‌స్పెక్టర్లు పి.డేవిడ్‌రాజు, డి.రవిరాజులు తమ సిబ్బందితో కల్సి వరంగల్‌ అండర్‌ బ్రిడ్జ్‌ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు నిందితులైన రఫికుల్‌ షేక్‌ , రోకస్‌ షేక్‌లు శివనగర్‌ నుండి నడుచుకుంటూ వస్తుండగా పోలీసులను చూసిన నిందితులు పరిగెత్తే క్రమములో పోలీసులు సదరు ఇద్దరు నిందితులు పట్టుకుని పంచుల సమక్షంలో తనిఖీ చేయడంతో నిందితులు వద్ద బంగారు అభరణాలను గుర్తించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోని విచారించగా నిందితులు పాల్పడిన చోరీలను పోలీసుల ఎదుట అంగీకరించడంతో పాటు నిందితులు ఇచ్చిన సమాచారంతో శివనగర్‌ ప్రాంతంలోని ఇంటిలో నివాసం వుంటుంన్న మరో ఇద్దరు నిందితులను అదుపులో తీసుకోని వారి నుండి బంగారు అభరణాలు, 5వేల రూపాయల నగదుతో పాటు, దుప్పట్లు, బట్టలు, చోరీలకు చేసేందుకు వినియోగించే సాధానాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.