వాంతి చేసుకుందామని ఓ మహిళ బస్సు కిటికీ నుంచి బయటకు వంగితే ఆమె తల తెగిపడిన ఘోర సంఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఆశా రాణి అనే మహిళ సత్నా నుంచి పన్నా జిల్లాకు బస్సులో బయల్దేరింది. మార్గమధ్యంలో ఆమెకు కడుపులో తిప్పినట్లుగా అనిపించడంతో వాంతి చేసుకునేందుకు బస్సు కిటికీ నుంచి బయటకు వంగింది. దీంతో ఆమె తల విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ఈ దెబ్బకు ఆశారాణి తల తెగి కిందపడింది. బస్సు వేగంగా వెళ్తుండటమే ఇందుకు కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనతో బస్సులో తోటి ప్రయాణికులంతా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం మహిళ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.