దేశ రాజధాని ఢిల్లీలో ఆదృశ్యమైన ఇద్దరు తెలుగు వైద్యుల ఆచూకీ లభించింది. డిసెంబర్‌ 25వ తేదీన కనిపించకుండా పోయిన హిమబిందు, ఆమె స్నేహితుడు దిలీప్‌ సత్యలు సిక్కింలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారిని సురక్షితంగా ఢిల్లీకి తరలించారు. సోషల్‌ మీడియా సాయంతో పోలీసులు వీరిని వెతికి పట్టుకున్నారు. డిసెంబర్‌ 31వ తేదీన దిలీప్‌ సిక్కింలో ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆదృశ్యానికి గల కారణాలపై పోలీసులు వారిని విచారిస్తున్నారు.

కాగా, శ్రీధర్‌, దిలీప్‌, హిమబిందు ముగ్గురు ఎంబీబీఎస్‌లో క్లాస్‌మేట్స్‌. అలాగే ఆత్మీయ మిత్రులు. శ్రీధర్‌ అతని భార్య హిమబిందు ప్రస్తుతం ఢిల్లీలో వైద్యులుగా పనిచేస్తున్నారు. మరోవైపు చండీగఢ్‌లో పీజీ చేసిన దిలీప్‌, అక్కడే సీనియర్‌ రెసిడెన్సీసిగా చేసి.. 2 నెలల క్రితం మానేశాడు. ప్రస్తుతం ఉన్నత చదువులకు సన్నద్దమవుతున్నాడు. అయితే 25వ తేదీన ఢిల్లీకివచ్చిన దిలీప్‌ సత్య మధ్యాహ్నం హిమబిందుతో కలిసి బయటకు వెళ్ళాడు. దిలీప్‌ సత్యతో కలిసి చర్చిపోతున్నట్టు ఆమె భర్తకు చెప్పింది.

ఆ తరువాత , దిలీప్‌ , హిమబిందు కనిపించకుండా పోయారు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వచ్చాయి. దీంతో శ్రీధర్‌ ఢిల్లీ హాజ్‌కాస్‌ పోలీసులను ఆశ్రయించాడు. చంఢీగడ్‌లో ఉంటున్న దిలీప్‌ భార్య దివ్య.. భర్త ఆచూకీ తెలియకపోవడంతో అక్కడి నుంచి ఢిల్లీ చేరుకుంది. శ్రీధర్‌ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు వారి గురించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. రెండు ఫోన్లు సిచ్ఛాఫ్‌ రావడం.. వారిద్దరు రోడ్డుపై నడుస్తున్న ఓ వీడియో మాత్రమే లభించడంతో కేసు దర్యాప్తు కష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఎన్నో అనుమానాలు తలెత్తాయి. చివరకు సోషల్‌ మీడియా సాయంతో పోలీసులు వారి ఆచూకీని గుర్తించారు.