అన్న కొడుకు లండన్ వెళ్తుంటే సెండాఫ్ ఇచ్చి వస్తూ.. దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలయ్యారు. జనగామ–సూర్యాపేట రహదారిపై ఈ ఘోరం జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా కొత్తబజార్‌కు చెందిన పెనుగొండ సదాశివుడు కుమారుడు సాయిశంకర్‌ ఎంబీఏ చదివేందుకు లండన్‌ వెళ్తున్నాడు. సదాశివుడు, ఆయన భార్య మంజూష, ఆయన తమ్ము డు, మరదలు గణేశ్‌ (52), సుకన్య (42), ఇంకో తమ్ముడైన పూర్ణచందర్‌ భార్య శ్రీలత (35)లతో పాటు సాయిశంకర్, మిగతా తమ్ముళ్ల పిల్లలు హైదరాబాద్‌ వెళ్లారు.

తెల్లవారుజామున శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో సాయిశంకర్‌ను విమానం ఎక్కించారు. ఆ తర్వాత సదాశివుడు తన తమ్ముడు గణేశ్‌, కూతురు గాయత్రి, మరో తమ్ముడు పూర్ణచందర్‌ కూతురు ప్రవీణను వరంగల్‌ కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో దింపేందుకు కారులో మహబూబాబాద్ బయలుదేరారు. సూర్యాపేట వైపు నుంచి వస్తున్న డీసీఎం (ఏపీ 05 టీఎల్‌ 1369) డ్రైవర్‌ అతివేగంగా లారీని ఓవర్‌టేక్‌ చేసి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో గణేష్, సుకన్య, కారు డ్రైవర్‌ నజీర్‌ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీలత, మంజూష గాయపడ్డారు.

క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శ్రీలత మృత్యువాతపడ్డారు. మంజూషను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం అనంతరం డీసీఎం డ్రైవర్‌ లొంగిపోయినట్లు సమాచారం. ఈ వార్త తెలియడంతో సాయిశంకర్‌ అబుదాబినుంచి స్వస్థలానికి బయలుదేరాడు. సాయిశంకర్‌ స్వగ్రామానికి చేరుకున్నాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు.