భార్యాభర్తలు విడిపోయి, ఎవరిదారి వారు చూసుకున్నారు. కన్న కుమార్తెను గాలికి వదిలేశారు దీంతో అమ్మమ్మ దగ్గర ఉన్న బాలిక ఇటీవల మేనత్త ఇంటికి వచ్చింది. అయితే కన్న తల్లి దగ్గరికి రానీయకపోవడంతో వేదనతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరులోని మిట్టూరులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు:

చిత్తూరుకు చెందిన గీత(16) అమ్మానాన్నలు విడిపోవడంతో తమిళనాడులోని అమ్మమ్మ వద్దే చదువుకుంది. అయితే 10వ తరగతి ఫెయిలైంది. ఇటీవల చిత్తూరులోని తన మేనత్త ఇంటికి వచ్చింది. అమ్మ వద్దకు వెళ్లాలనుకున్నప్పటికీ ఆమె అనుమతించకపోవడంతో మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చీరతో సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందింది. ఈ మేరకు వన్‌టౌన్‌ ఎస్‌ఐ రమేష్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.