పారాసిటమాల్ మనం చాలా సాధారణంగా వినే ట్యాబ్లెట్ పేరు ఇది. కానీ ఈ పారాసెటమాల్‌ గుండె పోట్లకు, కార్డియాక్ అరెస్టులకు కారణమవుతుందా.? వినడానికి కంగారు కల్గిస్తున్నా ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ హార్ట్ జర్నల్‌ చేసిన పరిశోధనలసారం తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. చిన్న జ్వరం టాబ్లెట్టే కదా అని లైట్‌ తీసుకుంటే మీప్రాణాలే తీసేస్తుందని పరిశోధనలు తేల్చిచెబుతున్నాయి. జ్వరం ఒళ్లునొప్పులు ఇవి చాలా మందికి సర్వసాధారణం. వెంటనే ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరి. అందుకే చాలా ఇళ్లలో పోపుల పెట్టేలో వస్తువులా పారాసిటమాల్ టాబ్లెట్లు కనిపిస్తాయి. ఈ కరోనా కాలంలో మెడికల్ షాపుల్లో రికార్డు స్థాయిలో అమ్ముడు పోయిన డ్రగ్ పారాసిటమాల్. కానీ ఇప్పుడు ఇదే పారాసెటమల్ డేంజర్ అంటున్నాయి పరిశోధనలు. ఇటీవల కాలంలో ఆకస్మికంగా ఆగిపోతున్న గుండెకు ఈ టాబ్లెట్ల వాడకం కూడా కారణమనే వాదనకు బలం చేకూరుతుంది. ఇంతకీ పారాసిటమాల్‌లో ఏముంది? ప్రాణాంతకంగా ఎందుకు మారుతోంది.? హార్ట్ అటాక్స్ కారణాల్లో బీపీ ప్రధానమైంది. ఇలాంటి బీపీ పెరగడానికి సోడియం అంటే ఉప్పు ప్రధాన కారణం. ఉప్పు ఎక్కువగా తినడం అనేది గుండె, ఇతర ప్రసరణ వ్యవస్థలకు ఒక ముఖ్యమైన ప్రమాద కారకం.

ఉప్పులోన సోడియం మిళితం అయి ఉంటుంది. అలాంటి సోడియం నిల్వలను పారాసిటమాల్ టాబ్లెట్స్ పెంచుతున్నాయట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ హార్ట్ జర్నల్‌. అనడమే కాదు తన పరిశోధనలను ప్రపంచానికి విడుదల చేసింది. ప్రతి పారాసిటమాల్ టాబ్లెట్‌లో సోడియం గణనీయమైన మొత్తంలో ఉంటుందని తేల్చిచెబుతోంది. ఇలాంటి టాబ్లెట్స్ విచ్చలవిడిగా వాడటం వల్ల సోడియం నిల్వలు పెరిగి హార్ట్ అటాక్స్, కార్డియాక్ అరెస్టులకు కారణమవుతుంది హెచ్చరిస్తోంది. యూరోపియన్ హార్ట్ జర్నల్‌తో పాటు చైనాలోని సెంట్రల్ సౌత్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఎక్కువ కాలం పాటు సోడియం కలిగిన పారాసిటమాల్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ లేదా గుండె ఆగిపోయే ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు.

పరిశోధకులు 60 నుంచి 90ఏళ్ల మధ్య వయస్సు గల దాదాపు 3,00,000 మంది వ్యక్తుల నుండి డేటాను విశ్లేషించారు. రోగులలో సగం మందికి అధిక రక్తపోటు ఉంది. పరిశోధకులు ఈ పరిశోధనను వివిధ దశల్లో ఒక సంవత్సరం పాటు కొనసాగించి డేటాను వెల్లడించారు. అవును పారాసిటమాల్ లో సోడియం నిల్వలు ఉంటాయి. సాధారణ ప్రజలు వీటిని గుర్తించని స్థితిలో వాడేస్తున్నారు. వీటిని ఎలాంటి వైద్య సూచనలు లేకుండా ఇష్టానుసారం వేసుకోవడం వల్ల శరీరలో సోడియం నిల్వలు పెరిగి ప్రాణాంతకంగా మారుతోంది. ఇదే విషయాన్ని ఇప్పుడు యూరోపియన్ హార్ట్ జర్నల్‌ పరిశోధన వెల్లడించిందంటున్నారు వైద్యులు. ఈ కరోనాకాలంలో జ్వరం పేరుతో మెడకల్ షాపులకు వెళ్లి పారాసెటమల్స్ కొనుగోళ్లు అసాధారణంగా పెరిగాయని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. పారాసెటమల్ అంటే ప్రమాదం లేనిదే. కానీ దీని వాడకం విచ్చలవిడిగా మారిపోయింది. రోజుకు 6 నుంచి 10 టాబ్లెట్స్ వాడుతున్నవారి సంఖ్య కూడా ఉంది. అందులోనూ పారాసెటమల్ 500 ఎంజీ అనేది టాప్. కానీ ఇప్పుడు అది 650 ఎంజీ వచ్చేసింది. దాన్ని కూడా చాలా సాధారణ ట్యాబ్లెట్‌గా వినియోగించేస్తున్నారు. ఇదే సోడియం నిల్వలు పెంచడానికి, ప్రాణాంతకం కావడానికి కారణమవుతోందంటున్నారు వైద్యులు.

సోడియం నిల్వలు పెరిగితే:

గుండెకు తీవ్ర నష్టమే అంటున్నారు కార్డియాలజిస్టులు. గుండె పోటు రావడమే కాదు కార్డియాక్ అరెస్టులు సైతం జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. పారాసిటమాల్ కదా అని లైట్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. గుండెకు రకాన్ని తీసుకెళ్లి తిరిగి తీసుకువచ్చే నాళాల్లో సోడియం పెరగటం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. గుండె రక్తన్ని తీసుకోవడం, పంప్ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. వైద్యులు ప్రిస్కిప్షన్‌ అవసరం లేని మందుల్లో పారాసిటమాల్ ఉండటంతో మరింత ఎక్కువ వాడకం అవుతోందని దీనిపై నియంత్రణ వ్యవస్థలు పటిష్టంగా పనిచేయాలంటున్నారు. ఇప్పటికైనా పారాసిటమాల్ ఏ కదా అని గుటుక్కున వేసేసుకునే ముందు ఒక్కసారి గుండె కోసం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి..