పోలీస్​ శాఖలో పని చేస్తున్న హోం గార్డులకు గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 శాతం పీఆర్సీని హోం గార్డులకు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవంగా ఈ ఏడాది జూన్​లోనే ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ రెగ్యూలర్​ ఉద్యోగులకు మాత్రమే 30 శాతంతో పెరిగిన వేతనాలు చెల్లిస్తున్నారు. మిగిలిన వారికి వేతనాల పెంపును అమలు చేయడం లేదు.

ఒక్కో శాఖ వారీగా వేతనాలు పెంచుతూ ఇటీవల కాలంలో నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నెల మొదటివారంలో అంగన్​వాడీలకు వేతనాలు పెంచిన ప్రభుత్వం. ఇప్పుడు హోంగార్డుల వేతనాలను 30శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీరికి జూన్​ నుంచే వేతన పెంపును వర్తింపచేస్తున్నట్లు పేర్కొంది. జూన్​ నుంచి పెంచిన వేతనాలను త్వరలోనే ఏరియర్స్​ రూపంలో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.