దుస్తుల కొనుగోలు చేయడానికి వచ్చి దుకాణదారులను మోసగిస్తున్న కిలాడీ దంపతులను బెంగళూరు గిరినగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈనెల 8న అజిత్, గీతాంజలిలు కారులో గిరినగరలోని దుస్తుల దుకాణానికి వచ్చారు. శుభకార్యం ఉందని చెప్పి రూ. లక్షకు పైగా దుస్తులు కొనుగోలు చేశారు. తీరా బిల్లు వేసిన తరువాత చిన్నారికి అనారోగ్యంగా ఉండటంతో ఇంజక్షన్‌ వేయటానికి వచ్చామని, ఆ సమయంలో ఏటీఎం కార్డు మరిచిపోయానని చెప్పి గీతాంజలిని దుకాణంలో కుర్చోపెట్టి అజిత్‌ వెళ్లిపోయాడు.

కొద్దిసేపటి తరువాత అజిత్‌ బైక్‌లో వచ్చి గీతాంజలికి ఫోన్‌ చేశాడు. ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. ఇందుకు సంబంధించి దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు గిరినగర పోలీసులు దంపతులను అరెస్ట్‌ చేశారు. గతంలోను మద్దూరులో వీరిద్దరు రూ.4వేల విలువైన చెప్పులు కొనుగోలు చేసుకుని ఉడాయించారని పోలీసుల విచారణలో బయటపడింది.