ఓ నిండు గర్భిణి దారుణ హత్యకు గురైన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ గోనె సురేష్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వాసుశెట్టి వెంకట రామకృష్ణ, భార్య స్రవంతి(32)తో కలిసి కొండాపూర్‌లోని జేవీజీహిల్స్‌ డీఆర్‌ టవర్స్‌లో నివాసం ఉంటున్నాడు. వీరికి ఒక కుమార్తె కాగా, ప్రస్తుతం స్రవంతి 8 నెలల గర్భవతి. అతడి చిన్నమ్మ కూతురు లక్ష్మీప్రసన్న కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమెకు రెండేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా, పేరుపాలెం గ్రామానికి చెందిన కావూరు శ్రీరామ కృష్ణతో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెను వేధించేవాడు. దీంతో పెళ్లికి మధ్యవర్తిగా వ్యవహరించిన వెంకట రామకృష్ణ బంధువులతో కలిసి అతడి స్వగ్రామానికి వెళ్లి పంచాయితీ చేశాడు. దీంతో అప్పటి నుంచి వెంకట రామకృష్ణపై శ్రీరామకృష్ణ కోపం పెంచుకున్నాడు. దీనికితోడు అతడి భార్య లక్ష్మీ ప్రసన్న చందానగర్‌కు మకాం మార్చి వేరుగా ఉంటోంది.

నెల రోజుల క్రితం తన భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీరామ కృష్ణను పీఎస్‌కు పిలిపించి నోటీసు ఇచ్చారు. అప్పటి నుంచి బామ్మర్ది వెంకట రామకృష్ణను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న సాయంత్రం ఎర్రగడ్డలో వేట కొడవలి కొనుగోలు చేసి వెంకట రామకృష్ణ ఇంటికి వచ్చి కాలింగ్‌ బెల్‌ కొట్టడంతో స్రవంతి తలుపు తీసింది. అతను మాట్లాడే విధానం చూసి భయపడిన ఆమె పక్కింటి వారిని పిలిచేందుకు కేకలు వేస్తూ బయటికి వెళ్లగా వెనక నుంచి వచ్చిన శ్రీ రామకృష్ణ వేట కొడవలితో ఆమెపై దాడి చేయడంతో కుప్పకూలింది. స్థానికులు ఆమెను సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందింది.