ఓ వ్యక్తి భార్య గర్భవతి అయిన ప్రతీసారి అబార్షన్‌ చేయిస్తూ వచ్చాడు. ఇలా రెండు సార్లు చేశాడు, మూడో సారి కూడా భార్యకు అబార్షన్‌ చేయించటానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్త నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అత్తింటి ముందు నిరసనకు దిగింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు: విజయనగరం జిల్లా, చుక్కపేటకు చెందిన ఓ యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. మొదటి సారి గర్భం దాల్చినపుడు భర్త ఆమెకు అబార్షన్‌ చేయించాడు. భర్త మాట కాదనలేక ఆమె అబార్షన్‌ చేయించుకుంది. కొన్ని నెలల తర్వాత ఆమె మళ్లీ గర్భం దాల్చింది. ఈ సారి కూడా భర్త ఆమెకు అబార్షన్‌ చేయించాడు.

ఇప్పుడు కూడా ఆ యువతి భర్త మాట కాదనలేక ఇష్టం లేకపోయినా అబార్షన్‌ చేయించుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా, యువతి మరోసారి గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న భర్త అబార్షన్‌ చేయించుకోవాలని ఆమెకు చెప్పాడు. ఈసారి ఆమె భర్త మాట వినలేదు అబార్షన్‌ చేయించుకోనని అంది, భార్య తన మాట వినకపోవటంతో భర్త మొహం చాటేశాడు. భార్యను పట్టించుకోవటం లేదు. దీంతో యువతి అత్తింటి దగ్గరకు వచ్చింది. తన భర్త మూడోసారి అబార్షన్‌ చేయించుకోమంటున్నాడంటూ నిరసనకు దిగింది. అత్తింటి ముందు భైఠాయించింది. రాత్రంతా అక్కడే కూర్చుని ఆందోళన చేపట్టింది.