చల్లా ధర్మారెడ్డిని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అభినందించారు

జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఢిల్లీలోని చాణక్య ఫౌండేషన్ ఉత్తమ నియోజకవర్గంగా తెలంగాణలోని పరకాల నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. గతనెల 26న ఢిల్లీలో కేంద్రమంత్రి శ్రీ రామేశ్వర్ తేలి, పద్మ విభూషణ్ శ్రీ మురళీ మనోహర్ జోషి చేతుల మీదుగా ఎమ్మెల్యే శ్రీ చల్లా ధర్మారెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రగతిభవన్ లో ఆయన సీఎం కేసీఆర్ ను కలిశారు. చల్లా ధర్మారెడ్డిని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అభినందించారు. ముఖ్యమంత్రి అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల కారణంగానే తనకు ఈ అవార్డు వచ్చిందని ఎమ్మెల్యే ధర్మారెడ్డి పేర్కొన్నారు. తనకు అవార్డు రావడానికి కారణమైన ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.