తన మాజీ మహిళా ఉద్యోగినిపై అత్యాచారం జరిపి ఆ తర్వాత ఆమెను వేశ్యా వాటికలో అమ్మేసిన నేరానికి గోరెగావ్‌కు చెందిన ఒక 27 ఏళ్ల వ్యాపారిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పాత జీతం బకాయిలు ఇస్తానని చెప్పి రప్పించుకుని ఆమెకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడిన ఆ వ్యాపారి ఆ తర్వాత ఆమెను ఒక వ్యభిచార కూపంలోకి నెట్టేసి పారిపోయాడు. నాగ్‌పాడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోరెగావ్ నివాసి అయిన ఆ వ్యాపారి క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నాడు.

బాధితురాలు అతని వద్ద ఉద్యోగం చేసేది. ఇటీవలే ఆమె ఉద్యోగం నుంచి తప్పుకుంది. తనకు రావలసిన జీతం బకాయిల కోసం ఆమె అడగడంతో సెప్టెంబర్ 2న తనను అంధేరి మెట్రో స్టేషన్ వద్దకు అతను రమ్మన్నాడు. అక్కడ నుంచి ఆమెను తన ద్విచక్రవాహనంలో బీచ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు మద్యం తాగించాడు. మైకం కమ్మిన ఆమెను నాగ్‌పాడాలోని ఒక గదికి తీసుకెళ్లాడు. మద్యం మత్తులో స్పృహలో లేని ఆమెపై ఆ రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.

మరుసటి రోజు ఉదయం ఆమె కళ్లు తెరిచేసరికి తాను కామాటిపురాలోని ఒక వేశ్యావాటికలో ఉన్నట్లు ఆమె గుర్తించింది. ఎలాగోలా ఆమె అక్కడ నుంచి బయటపడి నేరుగా నాగ్‌పాడా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు ఆమెకు సర్ జెజె ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సెప్టెంబర్ 5న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిన గదిని ఆ రాత్రికి రూ. 200కు అద్దెకు ఇచ్చిన కామాటిపురాలోని వేశ్యావాటిక యజమానురాలిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.