ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న క్లాస్‌మెట్స్ అంతా కలసి తమ మధ్య లేని ఓ స్నేహితుడి కుమార్తె వివాహాన్ని బాధ్యతగా జరిపించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు జడ్పీహెచ్ హై స్కూల్ లో 1992 -93 టెన్త్ క్లాస్ బ్యాచ్‌కి చెందిన నాటి విద్యార్థులంతా తమ స్నేహం బంధుత్వం, రక్తసంబంధం కంటే గొప్పదని నిరూపించారు. తమతో చదువుకొని ఆడి పాడిన స్నేహితుడు ఇప్పుడు లేడు. తమకు సాయం చేయమని అడిగింది లేదు. అసలు ఇలాంటి స్నేహితులు ఉన్నారని కుటుంబ సభ్యులకు కూడా తెలియని పరిస్థితి. అయినా సరే తమ మధ్య లేని తమ స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చారు ఆ స్నేహితులంతా. తమకు తోచిన విధంగా తలవచేసి ఆ కుటుంబాల్లో పెద్ద కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించారు.

తమ క్లాస్మేట్ అయిన కందుకూరి భిక్షమాచారి, ఆయన భార్య నాగమణి పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే ఇద్దరు చనిపోయారు. నాయనమ్మ తాతయ్య అన్నీ తామై వాళ్లను పెంచి పెద్ద చేశారు. అమ్మాయిలిద్దరూ గ్రాడ్యుయేషన్ పూర్తయింది. కొంత కాలం క్రితం మనవడు కూడా చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో మిగిలింది ఇద్దరు వృద్ధులు పెళ్లి వయసుకు వచ్చిన ఇద్దరు అమ్మాయిలు. విషయం తెలుసుకున్నభిక్షమాచారి టెన్త్ క్లాస్‌మెటేస్ అందరూ మాట్లాడుకొని తమ స్నేహితుని కుటుంబానికి హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే భిక్షమాచారి పెద్ద కుమార్తె మహేశ్వరికి మంచి సంబంధం ఓకే చేసి అందరూ కలిసి తలా కొంత డబ్బును కానుక, పెళ్లి కట్నం కోసం కలెక్ట్ చేసి కుటుంబానికి అందజేశారు. కూతురు పెళ్లి చూడకుండానే చనిపోయిన స్నేహితుడి కుమార్తె వివాహానికి తలో చేయి వేసి పెళ్లి బాధ్యతను సైతం నెరవేర్చారు. బంధువుల్లా వచ్చి తన పెళ్లిలో అన్ని తమ వ్యవహరించి అన్ని సక్రమంగా నెరవేర్చిన తన తండ్రి స్నేహితులకు ఆమె మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది.