ఆదిలాబాద్‌: జన్నారం మండలం పొనకల్‌ సాయిబాబ టెంపుల్‌ కాలనీలో నివాసం ఉంటున్న రాజన్నకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు మురిమడుగుల నరేశ్‌(23)కు గత డిసెంబర్‌ 10న వివాహం జరిగింది. నూతన సంవత్సరం పురస్కరించుకుని శుక్రవారం స్నేహితులతో కలిసి సరదాగా గడిపాడు. ఈ క్రమంలో లింగయ్యపల్లి గ్రామంలో ఉంటున్న స్నేహితుడి ఇంటికి పిలవడంతో రాత్రి 9గంటల ప్రాంతంలో మరో స్నేహితుడు గుడ్ల శ్రావణ్‌కుమార్‌తో కలిసి తన ద్విచక్ర వాహనంపై వెళ్లాడు.

అతివేగం కారణంగా ధర్మారం రోడ్డు వైశ్య భవన్‌ సమీపంలో మూలమలుపు వద్ద మోటార్‌సైకిల్‌ అదుపు తప్పి చెట్టును ఢీకొని పొలాల్లో పడిపోయారు. తీవ్ర గాయాలైన వారిద్దరిని 108లో తరలిస్తుండగా నరేశ్‌ మృతిచెందాడు. శ్రావణ్‌కుమార్‌ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.