అజిత్‌ కథానాయకుడిగా నటించిన తుణివు చిత్రం పొంగల్‌ సందర్భంగా ఈనెల 11వ తేదీ విడుదలై టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను రాబడుతోంది. దీంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక అజిత్‌ సంగతి తెలిసిందే. నటించి పూర్తి చేశాను అంతవరకే అన్నట్లు ఉంటుంది ఈయన ధోరణి. ప్రస్తుతం ఈయన తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. నయనతార భర్త విగ్నేష్‌ శివన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో సెట్స్‌పైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి చిత్త యూనిట్‌ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అజిత్‌ సరసన నటించే హీరోయిన్ల గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ముందుగా నటి నయనతార నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత త్రిష అంటూ వార్తలు వెలువడ్డాయి.

ఆ తరువాత నటి ఐశ్వర్యరాయ్, సాయి పల్లవి పేర్లు వినిపించాయి. తాజాగా మరో బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది ఆవిడే కీర్తి సురేశ్‌. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో అజిత్‌ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని, అందులో నటి ఐశ్వర్యరాయ్‌ ఒకరు కాగా, రెండో హీరోయిన్‌గా నటి కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే కీర్తి సురేష్‌ పంట పండినట్లే. ఇప్పటికే ఈమె నటుడు రజనీకాంత్, విజయ్, సూర్య, విక్రమ్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించారు. అజిత్‌కు జంటగా నటించాలనే ఆసక్తిని ఇటీవల ఆమె ఒక భేటీలో వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటిస్తున్న మామనిదన్‌ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.