హైదరాబాద్‌: థాయ్‌లాండ్‌లో ఇండియన్‌ గ్యాంబ్లింగ్‌ ముఠా అరెస్ట్‌ అయ్యింది. పటాయలో 90 మంది భారతీయులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ అయిన వాళ్లలో చికోటి ప్రవీణ్‌ కూడా ఉన్నట్లు సమాచారం. చికోటి ప్రవీణ్‌ ఆధ్వర్యంలోనే ఈ దందా నడుస్తున్నటు తెలుస్తోంది. పటాయలో ఓ హోటల్‌లో భారీ ఎత్తున్న గ్యాంబ్లింగ్‌ జరుగుతుందన్న సమాచారం అందుకున్న థాయ్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. థాయ్‌లాండ్‌ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు.

అరెస్ట్‌ అయిన వాళ్లలో భారతీయులతో పాటు పలువురు విదేశీయులు, 14 మంది మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. నిందితుల నుంచి రూ.20 కోట్లు విలువ చేసే గేమింగ్‌ చిప్స్‌, భారతీయ నగదును థాయ్‌లాండ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చికోటి ప్రవీణ్‌తో పాటు అరెస్ట్‌ అయిన వాళ్లలో మాధవరెడ్డి, దేవేందర్‌రెడ్డి కూడా ఉన్నారు. గేమ్స్‌ ఆడేందుకు పెద్ద ఎత్తున్న భారతీయులను చికోటి థాయ్‌లాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ హోటల్‌లో థాయ్‌లాండ్‌ మహిళలతో కలిసి క్యాసినో ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక సమాచారం.