కన్నూరుకు చెందిన రీషా (26), ప్రిజిత్ (35) భార్యాభర్తలు. గురువారం ఉదయం రీషాకు పురిటి నొప్పులు రావడంతో ప్రిజిత్ తన మారుతీ కారులో ఆమెతోపాటు మరో నలుగురు కుటుంబ సభ్యులను ఎక్కించుకొని హాస్పిటల్‌‌కు బయల్దేరాడు. వెనుక సీట్లో ఓ చిన్నారి సహా నలుగురు కూర్చోగా ప్రిజిత్ కారు నడుపుతుండగా పక్క సీట్లో రీషా కూర్చుంది. నడుస్తున్న కారు ముందు భాగం నుంచి అనూహ్యంగా మంటలు చెలరేగి ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. దీంతో వెనుక సీట్లో కూర్చున్న వారు గబగబా కిందకు దిగారు. కానీ ముందు సీటు డోర్లు ఓపెన్ కాకపోవడంతో భార్యాభర్తలిద్దరూ మంటల్లో చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి వచ్చే సరికే వారిద్దరూ ప్రాణాలు వదిలారు. అంతకు ముందే అక్కడికి చేరుకున్న జనాలు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కారులో నుంచి మంటలు ఎగిసి పడుతుండగా అందులో చిక్కుకుపోయిన దంపతులిద్దరూ మంటలకు తాళలేక కేకలు వేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కారు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లిన స్థానికులు అది పేలిపోతుందేమోననే భయంతో వెనక్కి రావడం ఆ వీడియోలో రికార్డయ్యింది.

‘కారు ముందు భాగం నుంచి మంటలు అంటుకున్నాయి. కానీ మేం నిస్సహాయంగా ఉండిపోయాం. కారు ఆయిల్ ట్యాంక్ ఏ క్షణమైనా పేలొచ్చనే భయంతో వారిని కాపాడేందుకు పెద్దగా ఏమీ చేయలేకపోయాం’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాకు తెలిపారు. పండంటి బిడ్డతో ఇంటికి తిరిగొస్తామని భావించగా ఊహించని రీతిలో తమ కళ్ల ముందే భార్యాభర్తలిద్దరూ అగ్నికి ఆహుతి అవుతుంటే కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందర్నీ కలచి వేసింది. కారు వెనుక సీట్లో కూర్చుని ప్రమాదం నుంచి బయటపడిన నలుగురిని హాస్పిటల్‌కు తరలించారు. వారికి గాయాలు కాలేదని కానీ వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు గమనిస్తున్నారని కన్నూరు పోలీస్ కమిషనర్ అజిత్ కుమార్ తెలిపారు. కారులో అకస్మాత్తుగా మంటలు అంటుకోవడానికి కారణమేంటనేది తెలియరాలేదు. నిపుణుల సాయంతో కారును పరీక్షిస్తాం. మరికొంత దర్యాప్తు చేస్తేనే కారుకు మంటలు అంటుకోవడానికి కారణమేంటనేది తెలుస్తుంది’ అని పోలీసులు తెలిపారు.