అమెరికాలో దుర్మరణం చెందిన తెలుగు దంపతుల కుమార్తెలు ఆదివారం స్వగ్రామానికి రానున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన నారాయణ, హరిత దంపతులు ఉద్యోగ రీత్యా ఏడేళ్లుగా అమెరికాలోని అరిజోనాలో ఉంటున్నారు. ఈ నెల 26వ తేదీన పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లిన దంపతులు సరస్సులో గల్లంతై, మృత్యుఒడికి చేరిన విషయం తెలిసిందే. వారి ఇద్దరు కుమార్తెలు పూజిత, హర్షితలు ఒంటరిగా మిగిలిపోయారు.

తానాతో పాటు నారాయణ పనిచేస్తున్న టీసీఎస్‌ కంపెనీ ప్రతినిధులు చొరవ తీసుకుని ఇద్దరు చిన్నారులను భారత్‌కు తీసుకువస్తున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం చిన్నారులను తీసుకుని టీసీఎస్‌ ప్రతినిధులు అమెరికాలోని డల్లాస్‌ నుంచి భారతదేశానికి బయల్దేరారు. ఆదివారం ఉదయానికి హైదరాబాద్‌ చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా స్వగ్రామానికి తీసుకువచ్చి నాయనమ్మ వెంకటరత్నం, తాతయ్య సుబ్బారావుకు చిన్నారులను అప్పగిస్తారని బంధువులు చెప్పారు. నారాయణ, హరిత మృతదేహాలు ఇక్కడకు వచ్చేందుకు మరికొద్ది రోజులు పడుతుందని తెలిపారు.