విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద అదృశ్యమైన వివాహిత సాయిప్రియ కీలక మలుపుతిరిగింది. పెళ్ళిరోజున భర్త శ్రీనివాసులుతో బీచ్ కి వచ్చిన ఆ యువతి… మొగుడికి మస్కా కొట్టి లవర్ కోసం నెల్లూరుకు వచ్చేసింది. పాపం అమాయకుడైన భర్త తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీచ్లో అలల ప్రవాహంలో కొట్టుకుపోయిందని భావించాడు. అతని ఫిర్యాదు మేరకు నేవీ సిబ్బంది, హెలికాఫ్టర్ లు రంగంలోకి దిగి సముద్రమంతా గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. తీరా చూస్తే ఆమె ప్రియుడు రవితో కలిసి నెల్లూరు పరారైంది. నెల్లూరుకి వచ్చిన తర్వాత సాయిప్రియ తన బంధువులకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటకొచ్చింది. శ్రీనివాస్ హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండడంతో ఈ జంట హైదరాబాద్లో కాపురం పెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది.
ఇదే సమయంలో సెకండ్ మ్యారేజ్ డే అని శ్రీనివాస్ ఈ నెల 25న హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చాడు. అదే రోజు సాయంత్రం 5.30 కి భర్త తో కలిసి బీచ్కి వెళ్లిన సాయి ప్రియ, అంతకు ముందే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది. శ్రీనివాస్ ఏమరపాటుగా ఉన్న సమయంలో రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
గాలింపు కోసం రూ. కోటి ఖర్చుః
ఇదిలా ఉంటే సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు రూ. కోటి ఖర్చు చేసింది. ఈ విషయమై విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ మాట్లాడుతూ: వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని, ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.