భర్త వరకట్న దాహానికి నవ వధువు బలైన సంఘటన కర్ణాటకలోని బెంగుళూరు రూరల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బెంగుళూరు రూరల్‌ జిల్లా దొడ్డ తాలూకా ఆచార్లహళ్లిలో చోటుచేసుకుంది తనుశ్రీ (22) మృతురాలు వివరాలు: చిక్క బళ్లాపురం జిల్లా చింతామణి తాలూకా జంగమసీగేహళ్లి గ్రామానికి చెందిన తనుశ్రీని దొడ్డ తాలూకా ఆచార్లహళ్లికి చెందిన నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తితో 9 నెలల క్రితం వివాహం జరిపించారు. మొబైల్‌ షాపు పెట్టుకున్న నవీన్‌కి భారీగా వరకట్నం సమర్పించారు. కానీ ఇంకా కట్నం తీసుకురావాలని తరచూ తనుశ్రీని పీడించేవాడు. ఫిబ్రవరి 9వ తేదీన కూడా తనుశ్రీ పుట్టింటి నుంచి రూ.1.20 లక్షలు నగదు తీసుకువచ్చింది.

మరోవైపు ఆమె గర్భం దాల్చగా స్కానింగ్‌ చేసి కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిసి భర్త, అత్త, మరిది బలవంతంగా అబార్షన్‌ చేయించారని సమాచారం. ఈ తరుణంలో మంగళవారం తనుశ్రీ ఇంట్లో అనుమానాస్పదంగా ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలింది. భర్త నవీన్, అత్త సువర్ణమ్మ, మరిది కిరణ్‌కుమార్‌ ఇల్లు వదిలి పరారయ్యారు. చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వడంతో తనుశ్రీ తల్లిదండ్రులు, బంధువులు పరుగున చేరుకున్నారు. తమ బిడ్డను అత్తింటివారే కొట్టి చంపారని విలపించారు.దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.