తండ్రి మరణించాడన్న వార్తను దాచిపెట్టి విధిలేని పరిస్థితుల్లో ఓ యువతికి వివాహం చేయించారు బంధువులు. తీరా పెళ్లయిన తర్వాత తండ్రి లేడన్న వార్త తెలుసుకుని ఆ కూతురు గుండెలవిసేలా రోదించింది. కూతురు పెళ్లి పనులన్నీ తానే దగ్గరుండి చూసుకున్న ఆ తండ్రి తీరా పెళ్లి సమయానికి కాసేపు ముందే మరణించాడు.

ఈ హృదయ విదారక ఘటన నాయుడుపేటలో జరిగింది. నాయుడు పేట వెల్‌కం కూడలిలో నివాసముంటున్న యస్దానీబాషా (56) షా ఫ్యాన్సీ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. తన కుమార్తె సైరాబానుకు కొద్దిరోజుల క్రితం వివాహాన్ని నిశ్చయించారు. ఈనెల 22వ తేదీన చేయాలని ఏర్పాట్లుచేశారు. ఈమేరకు బంధువులకు ఆహ్వాన పత్రికలు కూడా అందజేశారు. ఆ ఇంట పండగ వాతావరణం నెలకొంది.

ఇంతలోనే యస్దానీబాషా అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రికి వెళ్లగా పరిస్థితి ప్రమాదకరంగా ఉందని సూచించారు. దీంతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివాహ సమయానికి ముందుగా ఆయన ఆసుపత్రిలో తుదిశ్వాస వదిలారు. పుట్టెడు దుంఖాన్ని దిగమింగి కుటుంబ సభ్యులు వివాహం చేశారు. అప్పటివరకు తండ్రి మృతి చెందాడన్న విషయాన్ని కుమార్తెకు తెలియజేయలేదు. వేడుక పూర్తికాగానే విషయం తెలిసి సైరాబాను గుండెలవిసేలా రోదించింది. విషాదఛాయలు అలుముకున్నాయి.