హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ముందు వెళ్తున్న లారీని ఇన్నోవా కార్ ఢీ కొట్టింది. అయితే కారులో నుంచి గాయపడ్డ ఇద్దరు వ్యక్తులు హడావిడిగా లేచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అనుమానంతో స్థానికులు కారు లోపల చెక్ చేయగా ఏవో అనుమానాస్పద పార్శిల్ ప్యాకెట్స్ కనిపించాయి. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చెక్ చేసి కారులో ఉంది గంజాయిగా గుర్తించారు. గాయాలైన ఇద్దరు నిందితులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పరారైన మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. పోలీసుల దృష్టి మరల్చేందుకు కారుపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని స్టిక్కర్ వేయించారు దుండగులు.

అసలు ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది? ఎక్కడికి తరలిస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారు? అన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాలు రవాణా, వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్స్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌- విజయవాడ హైవే గంజాయి రవాణా కారిడార్‌గా మారింది. దొరికినవాళ్లపై కఠిన కేసులు పెట్టినప్పటికీ వారు జైలు నుంచి తిరిగి వచ్చి అదే దందా కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది.