ప్రియుడు కోసం సొంత ఇంటికే కన్నం వేసింది ఓ యువతి. ఏకంగా కోటి రూపాయల సొమ్మును ఎత్తుకొచ్చి తన ప్రియుడికి అప్పజెప్పింది. రాజ్‌కోట్‌ వ్యాపారవేత్త కూతురైన ప్రియాంకా పర్సానా (20) సీఏ చదువుతున్న సమయంలో హేత్ షా (20) అనే యువకుడితో ఏర్పడిన స్నేహం, ప్రేమగా మారింది. హేత్ బెంగళూరులో పైలట్ ట్రైనింగ్ తీసుకుంటుండగా, ఫీజుల నిమిత్తం డబ్బులు అవసరమయ్యాయి. ఈ డబ్బు లేక అతను కుమిలిపోతుంటే, చూసి తట్టుకోలేకపోయిన ప్రియాంక, ఇంటిదొంగగా మారింది.

గత నెల 29న తల్లి ఇంట్లోలేని సమయంలో రూ. 90 లక్షల విలువైన బంగారం, రెండు కిలోల వెండి వస్తువులతో పాటు రూ. 64 వేల నగదును దొంగలించి హేత్ చేతికిచ్చింది. ఆపై ఇంటిని చిందరవందర చేసి, కొన్ని వస్తువులను ధ్వంసం చేసి, దోపిడీ జరిగినట్టు నమ్మించే ప్రయత్నం చేసింది. ప్రియాంక తండ్రి కిశోర్‌ పర్సానా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును విచారించగా, తొలుత వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. బీరువాలను పగలగొట్టకుండా మారు తాళంతో దొంగతనం చేసినట్టు గుర్తించిన పోలీసులు, బాగా తెలిసిన వారే ఈ పని చేశారని భావించారు. సీసీ కెమెరా ఫుటేజీ, ప్రియాంక కాల్ డేటాను పరిశీలించారు. వారికి హేత్ పై అనుమానం రాగా, బెంగళూరుకు వెళ్లిన పోలీసుల. అతని వద్ద ఉన్న ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి, గుజరాత్ కు తీసుకువచ్చారు. ఇక తమ ఇంట్లో దొంగతనం చేసింది సొంత కుమార్తేనని తెలిసి దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు, కేసును ఉపసంహరించుకున్నారు.