ఇద్ద‌రు ఒకరినొకరు గాడంగా ప్రేమించుకున్నారు, క‌లిసి జీవితాన్ని పంచుకోవాల‌నుకున్నారు. ఇద్ద‌రు కులాలు వేరు కావ‌డంతో కుటుంబ పెద్ద‌లు వీరి పెళ్లిని అంగీక‌రించలేదు. దీంతో కన్నవారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఏడాదిన్నర కాపురం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత భ‌ర్త, త‌ల్లిదండ్రుల మాట విని త‌న‌ను కాపురానికి తీసుకెళ్లకుండా మోసం చేస్తున్నారంటూ భార్య అత్తింటి ఎదుట బైఠాయించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివరాలు: నిజామాబాద్ జిల్లా ఇంద‌ల్వాయి మండల తిర్మ‌న్ ప‌ల్లికి చెందిన‌ మౌనిక అదే గ్రామానికి చెందిన శ్రావణ్ ప్రేమించుకున్నారు. ఒక‌రికి ఒక‌రు జీవితాంతం తోడుగా ఉండాల‌నుకున్నారు. వీరి కులాలు వేరుకావ‌డంతో పెద్ద‌లు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో గ‌త సంవ‌త్స‌రం జూన్ 3న పెద్ద‌ల‌ను ఎదిరించి రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకున్నారు. శ్రావ‌ణ్, మౌనిక‌ గత కొంత కాలం నుంచి హైదరాబాద్ లో కాపురం పెట్టారు. పెళ్లైన‌ ఏడాదిన్న‌ర‌ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొద‌ల‌య్యాయి.

అత్త మామల‌ మాటలు విని భర్త శ్రావ‌ణ్ క‌ట్నం కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నాడ‌ని మౌనిక నాలుగు నెలల క్రితం హైదరాబాదులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే గురువారం అత్తమామలు వచ్చి నీకు భ‌ర‌ణం ఇస్తాము మా అబ్బాయికి విడాకులు ఇవ్వు అంటూ తెగేసి చెప్పారు. దీంతో నా భ‌ర్త నాకు కావాలి నేను విడాకులు ఇవ్వ‌నని అత్తింటి ఎదుట ఆందోళ‌న‌కు దిగానని మౌనిక చెబుతోంది. మా అత్తగారు, భర్త యొక్క అన్న రవికాంత్, అతని భార్య ఆమని నాపై దాడి చేశార‌ని చెబుతోంది. నా భ‌ర్త నాకు కావాలి, నేను భ‌ర్త‌కు విడాకులు ఇవ్వ‌ను, నాకు న్యాయం కావాలని మౌనిక పోలీసుల‌ను ఆశ్రయించింది. త‌న‌కు రూ. కోటి క‌ట్నం తీసుకు ర‌మ్మని వేదిస్తున్నారని వరకట్న వేధింపుల కేసు పెట్టారు. తన అత్తింటి వారి నుంచి నాకు ప్రాణ‌హాని ఉంది త‌న‌కు రక్ష‌ణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.