తిరువారూర్: తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్‌కు అన్నీ తానై వ్యవహరిస్తున్న 35ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. తిరువారూర్ జిల్లాలోని నన్నిళంలో ఉన్న మరుత్తువాంచేరి శివాలయం వీధిలో గణేశన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయన కూతురే సత్య(35). సత్యకు పదేళ్ల క్రితం ప్రభు అనే వ్యక్తితో వివాహమైంది. ఏడేళ్ల పాప కూడా ఉంది. అయితే, భర్తతో అభిప్రాయ భేదాలు రావడంతో కొన్నాళ్ల నుంచి సత్య తండ్రితోనే పుట్టింట్లో ఉంటోంది. గత పదిహేనేళ్లుగా సత్య పేరాలంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఆ స్కూల్‌కు ఆమెనే హెడ్‌టీచర్‌గా వ్యవహరిస్తోంది. ఏం జరిగిందో తెలియదు గానీ శనివారం నాడు రోజూలానే స్కూల్‌కు వెళ్లిన సత్య స్కూల్‌లోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

విషం తాగిన ఆమెను గమనించిన స్కూల్ సిబ్బంది మయిలదుతురై గవర్నమెంట్ హాస్పిటల్‌కు హుటాహుటిన తరలించారు. ఆమె చికిత్స పొందుతూ 2.50కి ప్రాణాలు కోల్పోయింది. దీంతో, అదే ఆసుపత్రిలో ఆమెకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. పేరాలం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యపై మాట్లాడిన ఆమె బంధువులు స్కూల్ యజమాని వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు. సదరు స్కూల్ యజమాని ఆమెపై లైంగిక వేధింపులకు పలుమార్లు పాల్పడ్డాడని ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక సత్య ప్రాణాలు తీసుకుందని చెప్పారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కూడా ఇదే నిజమని తేలింది. సదరు స్కూల్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.