భర్త నుంచి విడిపోయి ప్రియుడితో ఉంటున్న వివాహిత మహిళ కుళ్లిన స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. వివరాలు: తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్‌ ఎరుమైవెట్టిపాళ్యం గ్రామానికి చెందిన బాబు(36) స్కూల్‌ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య అముద(30). వీరికి కుమార్తె జయశ్రీ(10), కుమారుడు కిషోర్‌(07) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త నుండి విడిపోయిన అముద అదే ప్రాంతానికి చెందిన జగదీశ్వరన్‌ అనే వ్యక్తితో కలిసి సహాజీవనం చేస్తోంది. పాండిచ్చేరిలో ప్రియుడితో కలిసి ఉన్న అముదను గత 20 రోజుల క్రితం తల్లిదండ్రులు తీసుకొచ్చి బాబుతో కలిపి వెళ్లారు. అయితే వారం రోజుల తరువాత అముద మళ్లీ భర్తను వదిలిపెట్టి ప్రియుడితో వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో అముద కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు మున్సిపాలిటీలోని పెద్దకుప్పంలో మహిళ మృతదేహాం కుళ్లిన స్థితిలో కనిపించింది. మహిళ మృతదేహాన్ని వైద్యశాలకు తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో మృతి చెందిన మహిళ అముదగా గుర్తించారు. ఈ సంఘటనపై బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.