పాక్ నుండి ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించి ఎప్పటికప్పుడు భారత్‌పై దాడికి యత్నిస్తూనే ఉంటారు.అయితే వారిని సరిహద్దులో కాపలాగా ఉన్న భారత సైనికులు అడుగు కూడా పెట్టనివ్వకుండా తిప్పికొడతారు. కానీ కొన్నిసార్లు భారత సైనికుల కళ్లు కప్పివారు భారత్‌లోకి చొరబడటం మనం చూశాం.అయితే ఇలాగే భారత్‌లోకి చొరబడి సరిహద్దు రాష్ట్రం అయిన గుజరాత్ రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇంతకీ అవి ఏమీటి అని అనుకుంటున్నారా.. ?

పాక్ నుండి పెద్ద సంఖ్యలో మిడతలు భారత్‌లోకి చొరబడి గుజరాత్ రాష్ట్రంలోని పంటపొలాలపై పడి వాటిని నాశనం చేస్తున్నాయి.పాక్ సరిహద్దుల నుండి ప్రవేశించిన మిడతలు బనస్కాంత, మెహసనా, కచ్‌, పఠాన్‌, సాబర్కాంత జిల్లాల్లోని ఆవాలు, జీలకర్ర, ఆముదం, బంగాళదుంపలు, గోధుమ పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

పంటకు మందు కొట్టినా కూడా వాటి బారి నుండి తమ పంటను కాపాడుకోలేక పోతున్నామంటూ వాపోతున్నారు. పాక్ నుండి చొరబడుతున్న ఈ మిడతలు ఆఫ్రికా నుంచి వచ్చినట్లుగా వారు తెలిపారు.పదేళ్ల కిందట కూడా ఇలాంటి ఘటన జరిగిందని, ఇప్పుడు మళ్లీ మిడతలు గుజరాత్ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నాయని వారు వాపోతున్నారు. తమ పంటపొలాలను మిడతల బారి నుంచి కాపాడాలని గుజరాత్ రైతులు అధికారులను కోరుతున్నారు.ఏదేమైనా పాక్ నుంచి చొరబడే ఉగ్రవాదులే కాకుండా మిడతలు కూడా భారత్‌పై పగపట్టాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.