తిమ్మాపురం గ్రామలో గత నెల 28వ తేదీన జరిగిన ఓ వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ వినోద్‌కుమార్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు: ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం గ్రామానికి చెందిన రాఘవేంద్ర(42) మద్యానికి బానిసై కుటుంబీకులతో గొడవపడి కొద్ది రోజుల క్రితం కౌతాళం మండలం తిమ్మాపురం గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ వ్యవసాయ పనులకు వెళ్లి జీవిస్తూ అదే గ్రామానికి చెందిన హనుమంతురెడ్డి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు.

విషయం తెలుసుకున్న హనుమంతురెడ్డి గత నెల 28వ తేదీ రాఘవేంద్రను వేటకొడవలితో నరికి హత్య చేశాడు. పోలీసులు అదే రోజు డాగ్‌స్క్వాడ్‌తో పరిశీలించగా హనుమంతురెడ్డి ఇంటి చుట్టూ తిరిగింది. అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా గ్రామానికి చెందిన మూకయ్య సహకారంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. హత్య కేసును ఛేదించిన సీఐ పార్థసారధి, కోసిగి సీఐ ఎరిషావలి, కౌతాళం, పెద్దతుంబళం ఎస్‌ఐలు మన్మథ విజయ్, చంద్రను కర్నులు డీఎస్పీ అభినందించారు.