దేవీపట్నం : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటులో సుమారు 61మందికి పైగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ‌వరంగల్ నుంచి తాము 14మంది వచ్చామని, లాంచీ ఒక్కసారిగా పక్కకు ఒరుగుతూ నీళ్లలో మునిగిపోయిందని కాజీపేటకు చెందిన గొర్రె ప్రభాకర్‌ తెలిపారు. భయంతో కొంతమంది లాంచీ పైకి ఎక్కమన్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ పడవ తమను రక్షించిందని తెలిపారు. అయితే తమ కళ్ల ముందే కొంతమంది నీటిలో మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బోటులో ప్రయాణిస్తున్న చాలామంది లైఫ్‌ జాకెట్లు వేసుకోలేదని తెలిపారు. కాగా లాంచీలో మొత్తం 71మంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో 61మంది ప్రయాణికులు కాగా, 10మంది లాంచీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం.