రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

అన్నంపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న తోలెం ప్రభాకర్ (31) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. టేకులపల్లి మండలం లాలూ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయనడిన ప్రభాకర్ హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. బ్రెయిన్ డెడ్ కావడంతో వైద్యుల సూచన మేరకు ప్రభాకర్ అవయవదానం చేసేందుకు అతడి కుటుంబ సభ్యులు అంగీకరించారు.

అవయవదానం అనంతరం ప్రభాకర్ మృతదేహానికి శవ పరీక్ష చేశారు. ప్రభాకర్ మృతిపై జిల్లా ఎస్ పి సునీల్ దత్, పోలీసు అధికారులు , సిబ్బంది సంతాపం ప్రకటించారు. 2009 సివిల్ బ్యాచ్ కు చెందిన పోలీసు కానిస్టేబుళ్లు ప్రభాకర్ కుటుంబానికి రూ.80 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఇల్లెందు మండలం పూబెల్లి గ్రామంలో ప్రభాకర్ అంత్యక్రియలు నిర్వహించారు.