బస్ స్టాపులో బస్సు కోసం వేచి చూస్తున్న యువతికి లిఫ్టు ఇస్తానని చెప్పి ఓ వ్యక్తి కారులో ఎక్కించుకొని ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భువనేశ్వర్‌ DCP అనూప్‌ కె సాహూ ఈ ఘటనపై మాట్లాడుతూ: ఖుర్ధా జిల్లాలోని PN కాలేజీ సమీపంలో ఓ యువతి ఒంటి నిండా గాయాలతో, చిరిగిన దుస్తులతో రోడ్డుపక్కన పడి ఉన్నట్టు సమాచారమందిందని చెప్పారు.

వెంటనే సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించగా ఆమె అత్యాచారానికి గురైందని గుర్తించామని, వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. దీనికి కారణం తెలుసుకొని ఈ దారుణానికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, ఆ కారును కూడా సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. కదులుతున్న కారులోనే ఆమె అత్యాచారానికి గురైందని కుర్దా గ్రామీణ ఎస్పీ అజయ్‌ ప్రతాప్‌ స్వైన్‌ అన్నారు.

ఈ ఘటనతో యువతి తీవ్ర షాక్ కి గురైందని, ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో ఆమెకు చికిత్స జరుగుతోందని చెప్పారు. బాధితురాలు కోలుకున్నాకే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్పీ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.