ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి దర్శకత్వంలో అత్యధికంగా పాటలు పాడారు సింగర్ కౌసల్య. అప్పట్లో ఆమె పాడిన చాలా పాటలు శ్రోతలను బాగా అలరించాయి. 1999 తెలుగు సినిమా ‘నీ కోసం’లో తొలిసారిగా పాడిన కౌసల్య 350కి పైగా పాటలను ఆలపించారు. అయితే కెరీర్ పరంగా మంచిగానే ఉన్న కౌసల్య వైవాహిక జీవితం మాత్రం ఒడిదుడికుల నడుమ సాగింది. పెళ్లైన తర్వాత కుటుంబ సమస్యల కారణంగా చాలా బాధను అనుభవించింది. కొన్ని గృహ సమస్యల కారణంగా తన భర్త తనను వేధిస్తున్నాడని పోలీసు స్టేషన్‌లో అనేక సార్లు ఫిర్యాదు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వైవాహిక జీవితంగా ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు.

తాను వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డానన్నారు. అప్పట్లో తన బాబు చాలా చిన్న పిల్లవాడని వాడికి తండ్రి ప్రేమను దూరం చేసేందుకు ఇష్టం లేకనే ఎన్ని బాధలైనా అనుభవించానంటూ చెప్పుకొచ్చారు. తన భర్త మరో పెళ్లి చేసుకోవాలనుకునే వరకు సర్దుకు పోదామని ఓపికగా ప్రయత్నించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కుదరలేదన్నారు. బాబు పెద్దవాడు కావడంతో ప్రస్తుతానికి బాగానే ఉన్నానన్నారు. ఇప్పుడు వాడు తనను మళ్లీ పెళ్లి చేసుకోమని అంటున్నట్లు వివరించారు కౌసల్య. అలాగే తన పుట్టినింటి గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారని. అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది. ఎనిమిదేళ్ల క్రితం ఆమె చనిపోయారు. ఇప్పుడు తనే నా లోకం తన పాటకి మంచి గుర్తింపు వస్తే, ముందుగా సంతోషపడేది మా అబ్బాయే అన్నారు.