వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధుతో వివాహం చేయాలని కోరుతూ ఓ 70 ఏళ్ల వ్యక‍్తి ఏకంగా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు. అయితే అతగాడు ఆ పిటిషన్‌లో తన వయసు కేవలం16ఏళ్లుగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకవేళ సింధుతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు సిద్ధమని పేర్కొన్నాడు. వివరాల్లోకి తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి అనే వృద్ధుడు పీవీ సింధుతో వివాహం చేసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు పిటిషన్‌ పెట్టుకున్నాడు.

సింధును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాని, వివాహానికి అవసరమైన ఏర్పాట్లు చేయకుంటే ఆమెను అపహరించి అయినా పెళ్లి చేసుకుంటానని అతగాడు చెప్పుకొచ్చాడు. కాగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మలైస్వామి సింధు ఆటతీరు తనను ఎంతో ఆకట్టుకుందని, ఆమెను తన జీవిత భాగస్వామిని చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ ఇద్దరి ఫోటోలను (సింధు, మలైస్వామి) జతచేసి కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాడు. అయితే ఆ పిటిషన్‌లో మలైస్వామి తన వయస్సు కేవలం 16 ఏళ్లని, 2004 ఏప్రిల్‌ 4న పుట్టానని పేర్కొన్నాడు. ఈ వింత అభ్యర్థనపై కలెక్టర్‌తో పాటు విషయం తెలిసినవాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే మలైస్వామి మాత్రం సింధుతో తన పెళ్లి చేయాల్సిందేనని పట్టుపడుతున్నాడు.