సిరిసిల్ల యువతి కిడ్నాప్‌ కేసులో భారీ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తాను జ్ఞానేశ్వర్‌ (జానీ) అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది శాలిని. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని పేర్కొంది. ఇష్టపూర్వకంగానే జానీతో వెళ్లినట్లు తెలిపింది. ఈ మేరకు పెళ్లి దుస్తులతో ఉన్న, ఫోటోలను, వీడియో విడుదల చేసింది. ‘జానీ నేను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారనే జానీతో వెళ్లా. రహస్య ప్రదేశంలో జానీని పెళ్లి చేసుకున్నా. నా తల్లిదండ్రుల నుంచి ప్రాణహానీ ఉంది’ అని వీడియోలో తెలిపింది.

కాగా జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో శాలిని అనే యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. శాలినికి సోమవారమే ఎంగేజ్‌మెంట్ అవ్వగా మంగళవారం తెల్లవారుజామున తండ్రి చంద్రయ్యతో కలిసి హనుమాన్ దేవాలయంలో పూజ చేసేందుకు వెళ్లిన శాలిని గుడి ముందే నలుగురు యువకులు అపహరించారు. అడ్డుకున్న యువతి తండ్రిని కొట్టి ఆమెను లాక్కెళ్లారు. యువతి కిడ్నాప్‌ ఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇప్పటి వరకు యువతిని కిడ్నాప్‌ చేశారని అంతా భావిస్తుండగా తానే స్వయంగా అతనితో వెళ్లిన్నట్లు వెల్లడించి అందరికి షాకిచ్చింది..