ప్రేమ విఫలం కావడంతో ఓ నర్సు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి: కాకినాడకు చెందిన రజని(27) గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తూ అక్క అనిత, తమ్ముడు అబెంజర్‌తో కలిసి కొండాపూర్‌లో నివాసం ఉంటోంది. కిమ్స్‌ ఆస్పత్రిలో పని చేసే సోదరి అనిత రాత్రి 9 గంటలకు రాగా లోపలి తలుపు గడియ పెట్టి ఉంది.

కిటికీలోంచి గడియ తీసి చూడగా చెల్లెలు రజని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. పక్కింటి వారి సహాయంతో కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెందింది. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆమె చాటింగ్‌ను పరిశీలించిన పోలీసులు ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామన్నారు. సోదరుడు సతి అబెంజర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.